ప్ర‌ణాళిక‌తో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌, నాలుగు సంద‌ర్శ‌న‌లు కార్య‌క్ర‌మం* - *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

ఎన్‌టీఆర్ జిల్లా/రెడ్డిగూడెం, మే 22, 2026*
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామస్థాయిలోనే వేగంగా పరిష్కరించి, రెవెన్యూ సమస్యల రహిత గ్రామాల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి రెడ్డిగూడెంలో ప్ర‌త్యేక ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)తో పాటు ఒక నెల‌-ఒక గ్రామం-నాలుగు సంద‌ర్శ‌న‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి స‌త్వ‌ర ప‌రిష్కారానికి అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. కార్య‌క్ర‌మంలో మొత్తం 57 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 23 అర్జీలు, గృహ‌నిర్మాణం, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌కు ఆరు చొప్పున అర్జీలు అందాయి. ఆర్ అండ్ బీకి సంబంధించి 5, విద్యాశాఖ‌కు 3, మైనింగ్‌, పోలీసు, డీఆర్‌డీఏ శాఖ‌ల‌కు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్థ‌క‌, పౌర స‌ర‌ఫ‌రాలు, ఎస్ఈ - పీఆర్‌, ర‌వాణా, ఏపీఎస్ ఆర్‌టీసీ, డ్వామా, ఎస్సీ కార్పొరేష‌న్ విభాగాల‌కు ఒక్కో అర్జీ అందింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నేరుగా ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, నిర్ణీత గ‌డువులోగా ప‌రిష్క‌రించేందుకు ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన రెవెన్యూ సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు సమయం, వ్యయం తగ్గడమే కాకుండా పరిపాలనపై నమ్మకం మరింత పెరుగుతుందని అన్నారు. జీడీడీపీ, కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌లు (కేపీఐ) త‌దిత‌రాల్లో జిల్లాను ముందువ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.
కార్య‌క్ర‌మంలో తిరువూరు ఆర్‌డీవో ఎ.కుమార్‌, పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.