విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా "పక్షులు – పర్యావరణ స్పృహ" అంశంపై సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
మంగళవారం దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పర్యావరణ స్పృహను పెంపొందించుకుని ప్రకృతి, పక్షుల సంరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు.
సంఖ్యాశాస్త్రాన్ని నిత్య జీవితంలో అన్వయించుకునే విధంగా నేర్చుకోవాలని, పదో తరగతి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ను సమర్థవంతంగా వినియోగించుకొని శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం పాఠశాలలోని వంటగది, మరుగుదొడ్లు, ప్రయోగశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరుగుదొడ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ప్రయోగశాలల్లో అందుబాటులో ఉన్న పరికరాలను సక్రమంగా వినియోగిస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, మండల విద్యాశాఖాధికారి విజయకుమార్, ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్. ఇతర అధికారులు పాల్గొన్నారు.