విజయవాడ: బయో డిగ్రేడబుల్ (పర్యావరణ హితంగా భూమిలో కలిసిపోయే) ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారిని కోరారు. బందర్ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. ఛాంబర్స్ ప్రతినిధులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యాలు, వాటి అమలు తీరుని ఆయన వివరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం, హరిత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలకు అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాలని పట్టాభిరామ్ కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని దాదాపు 40 వేల మంది వ్యాపారస్తులు ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తారని, పర్యావరణాన్ని కాపాడే విషయంలో సామాజిక బాధ్యతగా భవిష్యత్తులో అందరూ బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. బయో డిగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీదారులకు ముడి పదార్థాలు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ సరఫరా చేస్తామని, ఆ ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యతను మెప్మా, సెర్ప్ ద్వారా డ్వాక్రా గ్రూపులు, మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. తద్వారా మహిళలు కూడా వ్యాపార మెళకువలు తెలుసుకుని, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని చెప్పారు. ‘స్వయం’ అనే బ్రాండ్ పేరుతో వీటిని మార్కెట్ లోకి విడుదల చేస్తామని చెప్పారు. ఇలా చేయడం వల్ల బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వగలుగుతామన్నారు. మెప్మాకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన మంచి నెట్ వర్క్ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతోనే ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక మంచి ప్రయత్నం అని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారి సహకారం, ప్రోత్సాహం కావాలని పట్టాభిరామ్ కోరారు. పర్యావరణ పరిక్షణ, సామాజిక బాధ్యత, మహిళలకు ఆదాయం, తక్కువ ధరకు బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు అందుబాటులోకి రావడం... వంటి విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ఈ ‘స్వయం’ బ్రాండ్ బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేస్తారని పట్టాభిరామ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారిని కూడా ఆహ్వానిస్తామని, తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ పరిధిలోని 'స్వయం' ప్రాజెక్టుతో పాటు ఇతర కార్యక్రమాలకు ఏపీ ఛాంబర్స్ పూర్తి మద్దతు ఇస్తుందని పట్టాభిరామ్కు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత పరిశ్రమల సంస్థగా ఉన్న ఏపీ ఛాంబర్స్ ఈ మిషన్ లక్ష్యాలను ప్రచారం చేయడానికి, వాటిలో పాల్గొనడానికి తన సభ్య సంఘాలు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలను సమీకరిస్తుందన్నారు. ఈ సమావేశం ప్రభుత్వం, పరిశ్రమలు, ఛాంబర్స్ ప్రతినిధుల మధ్య సహకారానికి ఒక విలువైన వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ రావూరి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బి.రాజశేఖర్, మెప్మా ఏఎండీ వెంకటేశ్వరరావు, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తుల ఉత్పత్తిదారు హేమసాయిబాబు తదితరులు పాల్గొన్నారు.